
* హర్షం వ్యక్తం చేసిన మంత్రి సవిత
* బీసీలపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం ఈ అవార్డు
అమరావతి : బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించింది. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధతమయ్యే నిరుద్యోగ బీసీ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు గానూ 2025 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును ఈనెల 20 తేదీన న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ, సివిల్ సర్వెసెస్ కు ఉచిత కోచింగ్ అందజేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణ చేపట్టింది. అత్యధిక ఉపాధ్యాయ పోస్టులను బీసీ నిరుద్యోగ యువత సాధించాలన్న లక్ష్యంతో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రారంభించింది. ఈ ఉచిత శిక్షణ కేంద్రాల ద్వారా 1,674 మందికి కోచింగ్ అందజేశారు. వారికి నెలకు రూ.1500ల చొప్పున స్టయిఫండ్, పుస్తకాల కొనుగోలు మరో రూ.1000లు అందజేశారు. ఆన్ లైన్ లోనూ ఉచిత డీఎస్సీ కోచింగ్ నిర్వహించగా, 4,774 మందికి ఈ శిక్షణను వినియోగించుకున్నారు. ఇలా ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా 6,470 మందికి బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా మెగా డీఎస్సీ సన్నద్ధతకు ఉచిత శిక్షణ అందజేశారు. సివిల్ సర్వెసెస్ కు కూడా 83 మంది బీసీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఉచిత శిక్షణ అందజేసింది. ఈ శిక్షణల ద్వారా వందలాది మంది బీసీ అభ్యర్థులు టీచర్, గ్రూప్-1, రైల్వే సహా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించగలిగారు.
స్కోచ్ అవార్డు రాకపై మంత్రి సవిత హర్షం
బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగ బీసీ యువతను ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నత స్థానాల్లో నిలపాలన్న లక్ష్యంతో మెగా డీఎస్సీ, సివిల్ సర్వెసెస్ కోచింగ్ అందజేసినట్లు తెలిపారు. ఉచిత శిక్షణ ద్వారా ఎందరో బీసీ అభ్యర్థులు పలు ప్రభుత్వం ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. బీసీ యువత ఉన్నతికి సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. జగన్ ప్రభుత్వంలో బీసీలు తీవ్ర నిరాదరణకు గురయ్యారన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారన్నారు. బీసీల స్వయం ఉపాధి యూనిట్లు అందజేయకుండా నోట్లో మట్టికొట్టారన్నారు. నా బీసీలంటూ వెనుకబడిన తరగతుల వారిని జగన్ ఓటు బ్యాంకుగానే చూశాడన్నారు. బీసీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ఈ అవార్డు రాకతో తమపై మరింత బాధ్యత పెరిగిందని మంత్రి సవిత తెలిపారు.




